కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 నియంత్రణ చర్యల్లో భాగంగా రాత్రి కర్ఫ్యూ విధించింది. నేటి నుంచి మే 1 వరకు నైట్ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. అత్యసవర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిస్తున్నట్లు తెలిపింది. ఇక రాత్రి 8 గంటల వరకే బార్లు, రెస్టారెంట్లు, థియేటర్స్ నిర్వహణకు అనుమతినిచ్చింది. అదే విధంగా మీడియా, పెట్రోల్ బంక్లు, ఐటీ సేవలకు అనుమతినిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌసింగ్, విద్యుత్ సేవలు యథాతథంగా కొనసాగుతాయని, స్థానిక, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. అదే విధంగా, ప్రయాణాలకు ఎలాంటి ప్రత్యేకమైన పాసుల అవసరం లేదని పేర్కొంది.
కర్ఫ్యూ నుంచి మినహాయింపులు:
- ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్లు, ఫార్మసీలు
- ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా
- టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సర్వీసులు, బ్రాడ్కాస్టింగ్, కేబుల్ సర్వీసులు, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు
- ఇ- కామర్స్ వస్తువుల డెలివరీకి అనుమతి
- పెట్రోల్ పంపులు, ఎల్పీజీ, సీఎన్జీ, పెట్రోలియం, గ్యాస్ అవుట్లెట్లు
- శక్తి ఉత్పాదన, పంపిణీ
- కోల్డ్ స్టోరేజీ, వేర్హౌజింగ్
- నీటి సరఫరా, పారిశుద్ధ్యం
- ప్రైవేటే సెక్యూరిటీ సర్వీసులు
- ప్రొడక్షన్ యూనిట్లు
కర్ఫ్యూ సమయంలో వీరు మినహా మిగతా పౌరులు బయట తిరగడం నిషేధం.
- పైన పేర్కొన్న సంస్థల్లో పనిచేసేవారు(ఐడీ కార్డు తప్పక చూపించాలి)
- కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాధికారులు ఐడీ కార్డు చూపించి ప్రయాణాలు చేయవచ్చు
- డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్, ఇతర ఆస్పత్రి సిబ్బందికి అనుమతి
- గర్భిణులు, వైద్య సహాయం తప్పనిసరిగా అవసరమైనవారు
- ఎయిర్పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండు నుంచి రాకపోకలు సాగించేవాళ్లు టికెట్ చూపించాలి.
గమనిక: నైట్ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్ 51-60, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకోబడతాయి.