ఏపీలోనూ ఉనికిని చాటుకోవాలని భావించిన బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో నిరాశ తప్పలేదు. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల గుర్తింపులో మార్పులు చేర్పులు చేసింది. ఈ క్రమంలో, బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా ఉపసంహరించింది.
రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే… ఆ రాష్ట్రంలో చివరగా జరిగిన ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు కానీ, మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 3 శాతం సీట్లు కానీ సాధించాల్సి ఉంటుంది. అటు, 25 ఎంపీ సీట్లకు కనీసం ఒకటైనా గెలిచి ఉండాలి. పార్టీ అభ్యర్థులకు కనీసం 8 శాతం ఓట్లయినా వచ్చి ఉండాలి.
ఈ లెక్కన చూస్తే… ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి కూడా పోటీ చేయలేదు. అందువల్లే ఏపీలో బీఆర్ఎస్ కు రాష్ట్ర పార్టీ హోదా దక్కలేదు. తెలంగాణలో మాత్రమే బీఆర్ఎస్ కు రాష్ట్ర పార్టీ హోదా ఇస్తున్నట్టు ఈసీ నేటి ప్రకటనలో వెల్లడించింది.
ఇక, ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ), పశ్చిమ బెంగాల్ లో ఆర్ ఎస్పీలకు రాష్ట్ర పార్టీ హోదా రద్దు చేసింది. అటు, మేఘాలయలో వాయిస్ ఆఫ్ ద పీపుల్స్ పార్టీకి, త్రిపురలో తిప్రా మోతా పార్టీ, నాగాలాండ్ లో జనశక్తి పార్టీకి రాష్ట్ర పార్టీగా గుర్తింపునిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్-1968 పేరా 6 ప్రకారం ఈసీ ఈ మేరకు నిర్ణయించింది.
అదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కల్పించింది. ఈ మేరకు ఈసీ నుంచి ప్రకటన వెలువడింది.
మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ పార్టీకి, శరద్ పవార్ ఆధ్వర్యంలో నడిచే ఎన్సీపీకి ఈసీ నిర్ణయం తీవ్ర నిరాశ కలిగిస్తుందనడంలో సందేహం లేదు.
ఇక, ఆప్ విషయానికొస్తే ఢిల్లీలో పురుడుపోసుకున్న ఈ పార్టీ… క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. పంజాబ్ లోనూ అధికార పీఠం చేజిక్కించుకున్న ఆప్… మరికొన్ని రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.
ముఖ్యంగా, గతేడాది జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 5 స్థానాల్లో విజయం సాధించి ఉనికిని చాటుకుంది. గుజరాత్ బరిలో దిగిన తొలిసారే ఈ స్థాయిలో స్థానాలు కైవసం చేసుకోవడం మామూలు విషయం కాదు.