అప్సర హత్యకేసులో పోస్ట్మార్టం రిపోర్ట్ కీలకం కానుంది. సరూర్నగర్లోని మ్యాన్హోల్ నుంచి ఆమె మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి ఉస్మానియా మార్చురీకి తరలించారు. 6 రోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉందని తెలిపారు. ఈనెల 3న అప్సరను వెంకట సాయికృష్ణ హత్య చేసినట్లు నిర్ధారించారు. అదే రోజు సరూర్నగర్ మ్యాన్హోల్లో వేసి పూడ్చేశాడని గుర్తించారు. ఆ తర్వాత మ్యాన్హోల్ను కాంక్రీట్తో కప్పేశాడు.
ఈ మర్డర్ కేసును తప్పుదోవ పట్టించేందుకు వెంకట సాయికృష్ణ డ్రామా ఆడినట్లు తెలుస్తోంది. అక్క కూతురు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. ఎలాంటి బంధుత్వం లేదని తెల్చారు పోలీసులు. సరూర్ నగర్లో ఓకే కాలనీలో ఉంటున్నట్లు తెలిపారు.
సరూర్నగర్ చెందిన వెంకట సాయికృష్ణ వృత్తిరీత్యా పూజారి. ఆయనకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొంతకాలం క్రితం అతనికి అప్సరతో పరిచయం ఏర్పడింది. ఇదిప్రేమగా మారింది. అయితే గత కొన్నిరోజుల నుంచి అప్సర.. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకువస్తోంది. తాను ఇంకో పెళ్లి చేసుకోలేనని తేల్చిచెప్పాడు. అయినా వినకుండా అప్సర అతనిపై ఒత్తిడి తెస్తూనే ఉంది. దీంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని వెంకట సాయికృష్ణ హత్య చేశాడు.
శంషాబాద్ సుల్తాన్పల్లి ప్రాంతానికి అప్సరను కారులో తీసుకెళ్లి.. నిర్మానుష్య ప్రదేశంలో బండరాయితో తలపై కొట్టి చంపాడు. ఆ తర్వాత మృతదేహాన్ని సంచిలో కట్టి సరూర్నగర్ తీసుకొచ్చాడు. సరూర్నగర్ చెరువు సమీపంలోని మ్యాన్ హోల్లోకి మృతదేహాన్ని వేశాడు. అనంతరం ఏమీ ఎరుగనట్టు అప్సర కనిపించడం లేదని ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ కెమెరాల ఫుటేజ్ను విశ్లేషించగా వెంకట సాయికృష్ణ హత్యకు పాల్పడినట్టు వెల్లడైంది.
తన కూతురిని హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని అప్సర తల్లి డిమాండ్ చేస్తున్నారు. ప్లాన్ ప్రకారమే హత్య చేశాడని తెలిపింది. తన కూతురు రోజూ గుడికి వెళ్లేదని.. అక్కడే వెంటక సాయికృష్ణతో పరిచయం ఏర్పడిందన్నారు. వెంకట సాయికృష్ణ కూడా తరచూ తమ ఇంటికి వచ్చేవాడని తెలిపింది.
సరూర్నగర్ బంగారు మైసమ్మ ఆలయంలో మూడేళ్లుగా వెంకట సాయికృష్ణ పూజారిగా పనిచేస్తున్నాడని టెంపుల్ ఛైర్మన్ తెలిపారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడతాడని ఊహించలేదన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు