విదేశాల్లో ఉంటున్న ఖలిస్థాన్ మద్దతుదారులు భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాజాగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ లండన్ పర్యటనలో ఖలిస్థానీ సానుభూతిపరులు రెచ్చిపోయారు. ఆయనపై దాడికి యత్నించారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఈ నెల 4న జైశంకర్ లండన్ పర్యటనకు వెళ్లారు. ఐదు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. నిన్న రాత్రి లండన్ లోని ఛాతమ్ హౌస్ లో జరిగిన అధికారిక సమావేశాలకు ఆయన హాజరయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చిన సమయంలో ఖలిస్థానీ అనుకూలురు ఖలిస్థానీ జెండాలను ప్రదర్శిస్తూ భారత్ కు, విదేశాంగ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంతలో గుంపులోని ఒక వ్యక్తి భారత జెండాను పట్టుకుని జైశంకర్ కారు సమీపంలోకి వచ్చి, మన జాతీయ జెండాను అవమానించేలా ప్రవర్తించాడు. దీంతో అప్రమత్తమైన లండన్ పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.