ఢిల్లీ : బిఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంతో కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బుధవారం ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు పంపింది. ఈ కేసులో అసెంబ్లీ సెక్రెటరీకి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కు, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలతో పాటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 25లోగా ఎట్టి పరిస్థితుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
కాంగ్రెస్ లో చేరిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 15న బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎం.సంజయ్కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీపై కేటీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను అన్నింటినీ సుప్రీంకోర్టు కలిపి విచారిస్తోంది.