కరీంనగర్ జిల్లా: చిగురుమామిడి మండలం చిగురుమామిడి, ముల్కనూర్ గ్రామాలలో గల పౌల్ట్రీ ఫార్మ్స్, ఇటుక బట్టీలలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి పని చేస్తున్న 25 మంది విద్యార్థులు చిగురుమామిడి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో,చిన్న ముల్కనూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చేరారు. వీరికి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి స్కూలు బ్యాగులతో పాటు స్టడీ మెటీరియల్ అందజేశారు. కాగా స్కూలు బ్యాగులను, స్టడీ మెటీరియల్ ను తహసిల్దార్ ముద్దసాని రమేష్, ఎంపీడీవో బాస మధుసూదన్, మండల విద్యాధికారి పావని కలిసి ఆయా పాఠశాల విద్యార్థులకు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జిల్లా కలెక్టర్ బడి బయట పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు రావాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిగురు మామిడి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రబియా బస్రి, శోభా రాణి ,ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సుజాత శారద తదితరులు పాల్గొన్నారు.
