contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Sangareddy: ఏసీబీ వలలో సిఐ – పోలీస్

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి సీసీఎస్ సీఐ.  దొంగకు ఇంటి తాళాలు అప్పగించినట్టు జిల్లాలో జరుగుతున్న క్రైమ్‌లను కంట్రోల్ చేయడానికి జిల్లా ఎస్పీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సీసీఎస్ ని అవినీతి పరుడైన అధికారికి అప్పగించారు. గతంలో అనేక అవినీతి ఆరోపణలతో వివాదాస్పదమైన అధికారికి సంగారెడ్డి సీసీఎస్ బాధ్యతలు కట్టబెట్టారు. ఇంకేం దొరికినంత దోచుకోవడమే పనిగా సీసీఎస్‌ను ఆదాయ వనరుగా మార్చుకున్నాడు. కేసుల పేరుతో బెదిరించడం అందిన కాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఆ ఆరోపణలతో కొన్ని రోజుల క్రితం సస్పెండ్ అయ్యాడు. అయినా అధికారి వక్ర బుద్ధి మారలేదు. గతంలో ఒక కేసు విషయంలో రియల్ వ్యాపారి దగ్గర నుంచి భూమి పత్రాలు తీసుకొని తన దగ్గర పెట్టుకొని బ్లాక్ మెయిల్‌కి దిగాడు. కోటిన్నర రూపాయలు ఇస్తేనే భూమికి సంబంధించిన పత్రాలను అందజేస్తానని బెదిరిస్తూ.. సదరు వ్యాపారిని తీవ్రంగా భయాందోళనకు గురి చేశాడు. దీంతో సదరు వ్యాపారి ఏసీబీ‌ని ఆశ్రయించాడు.

వివరాల్లోకి వెళితే.. ఎమ్మెస్వి కిషోర్ అనే ఇన్స్పెక్టర్ సంగారెడ్డి సీసీఎస్ లో గతంలో విధులు నిర్వహించారు.ఆ సమయంలో ఒక కేసులో అమీన్పూర్‌కి చెందిన రియల్ వ్యాపారి రవి గౌడ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు సంబంధించిన భూపత్రాలను సదరు అధికారి స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసులో కోర్టు నుంచి బెయిల్‌పై నుంచి రవి గౌడ్ విడుదలయ్యారు. అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలతో సీసీఎస్ సీఐని సస్పెండ్ చేశారు. అయితే రవి గౌడ్ నుంచి స్వాధీనం చేసుకున్న భూ పత్రాలను తన దగ్గర పెట్టుకున్న కిషోర్ రూ, కోటిన్నర డిమాండ్ చేసి ఆ డబ్బులు ఇస్తేనే భూమి పత్రాలు ఇస్తానని లేకపోతే ఆ పత్రాలను ధ్వంసం చేస్తానని బెదిరించాడు. సదరు సీఐ నుంచి బెదిరింపులు అధికం కావడంతో బాధితుడు రవి గౌడ్ ఏసీబీ‌ని ఆశ్రయించారు. మొదట విడతగా రూ.25 లక్షలు చెల్లిస్తామని తెలిపి రూ.5 లక్షలు తనతో తీసుకెళ్లి బ్యాగులో పెట్టి ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సస్పెన్షన్లో ఉన్న విషయాన్ని సైతం మర్చిపోయి అడ్డగోలుగా డబ్బులను డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.

అక్రమ కేసులను బనాయించాడు: బాధితుడు రవి గౌడ్

సంగారెడ్డి సిసిఎస్ సీఐగా బాధ్యతలు నిర్వర్తించిన కిషోర్ ఆది నుంచి అవినీతికి పాల్పడ్డారని రియల్ వ్యాపారి రవి గౌడ్ ఆరోపించారు. తనకు సంబంధం కేసులో అక్రమంగా ఇరికించారని వాపోయారు. క్రైమ్ ను అరికట్టాల్సిన అధికారి తప్పుడు కేసులతో అమాయకులను బెదిరించి అడ్డగోలుగా దోచుకున్నాడని తెలిపారు. తన ప్రమేయం లేని కేసులో తనని ఇరికించడమే కాకుండా తన భూమి పత్రాలను అక్రమంగా తన దగ్గర పెట్టుకొని కోటిన్నర డిమాండ్ చేశారని వివరించాడు. తన కేసు విషయంలోనే కాకుండా ఆయన విధులు నిర్వహించిన సమయంలో అనేక మందిని ఇదే విధంగా బెదిరించి అడ్డగోలు వసూలు చేశాడన్నారు. తన భూ పత్రాలు ఆయన దగ్గర పెట్టుకొని డబ్బులు ఇస్తేనే డాక్యుమెంట్స్ ఇస్తానని లేని పక్షంలో వాటిని ధ్వంసం చేస్తానని టార్చర్ చేశాడని కన్నీటి పర్యంతమయ్యారు. అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన తన తీరు మారకపోగా మరింతగా హింసించాడని తెలిపారు.

తనకు గత్యంతరం లేకపోవడంతో చివరకు ఏసీబీని ఆశ్రయించానని వెల్లడించాడు. రూ. కోటిన్నర ఇస్తేనే డాక్యుమెంట్లు ఇస్తానని బెదిరించడంతో మొదటి విడతగా రూ. 25 లక్షలు చెల్లిస్తానని తెలిపి ఏసీబీ అధికారులకు సమాచారం చేరవేశానన్నారు. ఏసీబీ అధికారుల సలహా మేరకు బ్యాగులో రూ. ఐదు లక్షల రూపాయలను పెట్టి ఆయనకు అందిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారన్నారు. నిజాయితీతో వ్యవహరించాల్సిన అధికారి తప్పుడు కేసులతో అనేక మందిని వేధించాడని, సిసిఎస్ పోలీస్ స్టేషన్ ని వసూళ్లకు కేంద్రంగా మార్చారని విమర్శించారు. ఆయన హయంలో పెట్టిన అక్రమ కేసులతోపాటు ఆ అవినీతి అధికారి పాల్పడిన అవినీతిపై సంగారెడ్డి జిల్లా ఎస్పీ విచారణ జరిపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :