అల్లూరి జిల్లా, పాడేరు : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అర్హులైన లబ్ధిదారులందరికీ జాబ్ కార్డులు అందజేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు.సోమవారం సాయంత్రం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎంపీడీవో, డ్వామా అధికారులతో నిర్వహించిన మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో సగటు వేతనం రూ.252 రూపాయలు వస్తుందని, సగటు వేతనం పెరిగే విధంగా పనులలో నాణ్యత పెంచాలని సూచించారు.చింతపల్లి, జీకే వీధి తదితర మండలాల్లో అధికంగా జాబ్ కార్డులు ఉన్నప్పటికీ పనులు తక్కువగా ఉన్నాయని వాటిని పెంచడం ద్వారా అందరికీ పని కల్పించడంతోపాటు సగటు వేతనం పెరుగుతుందని వివరించారు.పనులకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో సెల్ఫ్ అఫ్ వర్క్స్ తయారు చేయాలన్నారు.వేతన దారుల ఆధార్ సీడింగ్, బ్యాంకు ఖాతాల,మొబైల్ నెంబర్లతో అనుసంధానం చేయాలని,ఈ కేవైసీ చేయాలని ఆదేశించారు. జిల్లాలో సుమారు 20 శాతం వరకు గ్రామాలలో పనులకు ప్రతిపాదనలు రాలేదని గుర్తించామని, జీరో పనులు ఉన్న గ్రామాల్లో సెల్ఫ్ అప్ వర్క్స్ క్రియేట్ చేసి వేతనదారులకు పని కల్పించాలని ఆదేశించారు.
గృహ నిర్మాణాలకు సంబంధించి ఎన్ఆర్ఇజిఎస్ తో అనుసంధానించి పనులు కల్పించాలని, పెండింగ్ లో ఉన్న సుమారు ఏడు కోట్ల రూపాయలకు ఎఫ్ టి ఓ జనరేట్ చేయాలని ఆదేశించారు.ఎంపీడీవోలు క్రియేట్ చేసిన పనుల ప్రతిపాదనలు వారి దగ్గర పెండింగ్లో లేకుండా డ్వామా పిడికి పంపించాలని, పిడి స్థాయిలో లేదా కలెక్టర్ స్థాయిలో పెండింగ్లో ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని 24 గంటల్లో పనులు మంజూరు చేస్తానని కలెక్టర్ తెలిపారు.కొండ ప్రాంతాలలో గృహ నిర్మాణాలకు రవాణా అధికంగా ఉందని ఎంపీడీవోలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, కలెక్టర్ స్పందిస్తూ అటువంటి వాటిని గుర్తించి ప్రతిపాదనలు పంపిస్తే అదనపు నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిస్తానని హామీ ఇచ్చారు. ఎన్ఆర్ఈజీఎస్ క్రింద చేపట్టిన పనులలో ఉద్యాన పంటల పనులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
పిల్లల ఆధార్ నమోదుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జనన ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయడం ద్వారా పిల్లల ఆధార్లను జనరేట్ చేయాలని ఆదేశించారు. ఆధార్, జనన ధ్రువీకరణ లేని వారందరికీ ఆధార్, జనన ధ్రువీకరణ జనరేట్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా బడి బయట ఉన్న వారిని గుర్తించి వారిలో ఎనీమియా తో బాధపడుతున్న వారికి తగు చికిత్స అందించాలన్నారు. 2005 – 2008 మధ్య పుట్టిన పిల్లలు ఏ విద్యాసంస్థల్లో, ఏ స్టేజ్ లో ఉన్నారా గుర్తించి వారికి కూడా ఎనీమియాతో బాధపడితే చికిత్స అందించాలన్నారు. జననీ సురక్ష యోజన క్రింద తల్లులతో బ్యాంకు ఖాతాలు ప్రారంభింపజేయాలని ఆదేశించారు. సచివాలయాలలో సూచించిన ఆరు రిజిస్టర్లను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు.
ఈ వీడియో సమావేశంలో సహాయ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాత్సవ, డ్వామా పీడీ రమేష్ రామన్, హౌసింగ్ పిడి బాబు, జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు, సిపిఓ ఆర్ఎస్ఎన్ పట్నాయక్, డివిజనల్ పంచాయతీ అధికారి కుమార్, మండలాల నుండి ఎంపీడీవోలు, డ్వామా ఏ పి ఓ లు తదితరులు పాల్గొన్నారు.