పల్నాడు జిల్లా నరసరావుపేట స్థానిక అంజిరెడ్డి ఆసుపత్రిలో వైద్యం వికటించి మూడేళ్ళ బాలుడు మృతి చెందాడు. సంతమాగులూరు కు చెందిన సుధాకర్, లక్ష్మి దంపతుల మనవడు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ వికటించి మృతిచెందాడు. బాధితులు మాట్లాడుతూ .. మాకు అంజిరెడ్డి హాస్పిటల్ మీద నమ్మకం లేదయ్యా.. గతంలో మా ఆయన విషయంలో మోసపోయాం.. గత్యంతరం లేక మా మనవడిని ఆసుపత్రిలో చేర్పించాం… అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ వికటించి .. మూడేళ్ల బాలుడు విక్రమ ఆదిత్య ఆదివారం మృతి చెందాడు. మృతుడు నాయనమ్మ తాతయ్యలు మీడియాతో మాట్లాడుతూ సర్జరీ కి ముందు బాలుడు బాగానే ఉన్నాడని అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్లు నిర్వహించి అంతా బాగుందని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు తెలిపారు. ఆదివారం తమ వద్ద లక్ష యాభై వేలు డిమాండ్ చేసి చివరకు 50వేల రూపాయలు వసూల్ చేసి రసీదు కూడా ఇవ్వలేదని తెలిపారు. సర్జరీ అనంతరం మధ్యాహ్నం రెండున్నర గంటలకు సర్జరీ సక్సెస్ అని బాలుడు మత్తులో ఉన్నాడని చెప్పినట్లు తెలిపారు. నాలుగు గంటల నుండి ప్రతి అరగంటకు ఒకసారి బాలుడికి ఫిట్స్ వచ్చాయని, జ్వరం వచ్చిందని, హార్ట్ స్ట్రోక్ వచ్చిందని రకరకాలుగా చెప్తూ మభ్యపెడుతూ సాయంత్రం ఏడు గంటల సమయంలో బాలుడు మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు తెలిపారు. గతంలో ఈ ఆసుపత్రిపై అనేక ఆరోపణలు ఉన్న జిల్లా వైద్యాధికారులు అమ్ముడుపోవటంతో ఆసుపత్రి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందనీ ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రి యాజమాన్యం ఆర్థిక, రాజకీయ బలంతో అందరినీ మేనేజ్ చేస్తూ రోగుల ప్రాణాలతో చలగాటమాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు . తమకు న్యాయం చేయాలి అంటూ బాధితులు ఆసుపత్రి ముందు బైఠాయించిన తీరు పలువురుని కన్నీరు పెట్టించింది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాలి.