అమరావతి : సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన నందమూరి బాలకృష్ణకు పొలిట్ బ్యూరో అభినందనలు తెలిపింది. టీడీపీ సభ్యత్వాల సంఖ్య కోటి దాటడంపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు కూడా పొలిట్ బ్యూరో అభినందనలు తెలిపింది. ముఖ్యంగా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపారంటూ సీఎం చంద్రబాబును పొలిట్ బ్యూరో ప్రత్యేకంగా అభినందించింది.
ఇక, త్వరలోనే పార్టీ సంస్థాగత ఎన్నికలు జరపాలని నేటి పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించారు. మే నెలలో టీడీపీ మహానాడు ప్లీనరీ జరగనుండగా, ఆ కార్యక్రమానికి ముందే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. నామినేటెడ్ పదవులపైనా నేటి సమావేశంలో లోతుగా చర్చించారు.