ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 1,392 పోలీస్ స్టేషన్లు ఉంటే… కేవలం 1,001 స్టేషన్లలోనే సీసీ కెమెరాలు ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. మిగిలిన స్టేషన్లలో కెమెరాలు ఎందుకు పెట్టలేదని నిలదీసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్ని పీఎస్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్న సీసీ కెమెరాల పనితీరుపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. జైళ్లలో ఉన్న సీసీ కెమెరాల పనితీరుపై కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
గతంలో కూడా పీఎస్ లు, జైళ్లలో సీసీ కెమెరాలపై హైకోర్టులో విచారణ జరిగింది. అన్నిచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అప్పట్లోనే హైకోర్టు ఆదేశించింది. అయితే, పీఎస్ లు, జైళ్లలో సీసీ కెమెరాలను అమర్చినప్పటికీ నిర్వహణ, సాంకేతిక కారణాల కారణంగా చాలా కెమెరాలు పని చేయడం లేదు. దీంతో, సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలులో పురోగతి లేదంటూ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలయింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు… సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి మరోసారి కీలక ఆదేశాలను జారీ చేసింది.