దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 24 శాతం పెరిగినట్లు కేంద్ర పన్నుల విభాగం తెలిపింది. కార్పొరేట్ పన్నుల్లో 16.74 శాతం, వ్యక్తిగత ఆదాయ పన్నుల్లో 32.30 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది.2022 ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 8 మధ్య రూ.8.98 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలైనట్లు తెలిపింది.రీఫండ్ల సర్దుబాటు తర్వాత ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.7.45 లక్షల కోట్లుగా నమోదైనట్లు పన్నుల విభాగం తెలిపింది. క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 16.3 శాతం వృద్ధి చెందినట్లు వెల్లడించింది. 2022-23 బడ్జెట్లో పేర్కొన్న ప్రత్యక్ష పన్నుల అంచనాల్లో ఇది 52.46 శాతానికి సమానమని పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి అక్టోబరు 8 మధ్య రూ.1.53 లక్షల కోట్లు రీఫండ్ చేసినట్లు తెలిపింది. క్రితం ఏడాదితో పోలిస్తే పెరిగినట్లు వెల్లడించింది.
