సృజనాత్మకంగా ఆలోచించడం, విమర్శనాత్మక ఆలోచనలను అమలు చేయడం, వాస్తవ-ప్రపంచ సవాళ్ల ద్వారా సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకోవడం వంటివి రోబోటిక్స్ రంగంలో రాణించడానికి తోడ్పడతాయని కిరణ్ మాటిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగానికి చెందిన ‘జీ-ఎలక్ట్రా’ క్లబ్ బుధవారం ‘రోబోటిక్స్ 1.0’ పేరిట ఒకరోజు కార్యశాలను నిర్వహించింది. మనదేశంలోని ఐఐటీలు, ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలు జాతీయ స్థాయిలో నిర్వహించే సాంకేతిక పోటీలలో పోటీపడేందుకు అవసరమైన జ్జానం, నైపుణ్యాలను గీతం ఇంజనీరింగ్ విద్యార్థులలో పెంపొందించే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. కిరణ్ తో పాటు ఎంబెడెడ్ డెవలపర్లు రజనీకాంత్ సేన్, హేమలు ఈ కార్యశాలలో ముఖ్య శిక్షకులుగా వ్యవహరించారు.
ఏదైనా రోబోటిక్స్ ప్రాజెక్టుకి జట్టు సమష్ఠి కృషి, సహకారం చాలా కీలకమని, ఇందులో ఎదురయ్యే అపజయాలను విజయాలకు సోపానాలను మలచుకోవాలని వారు నొక్కి చెప్పారు.
హ్యాకథాన్, రోబోటిక్స్, ఒలింపియాడ్ పేరిట ప్రతియేటా దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి సాంకేతిక పోటీలు నిర్వహిస్తుంటారని, వాటిలో పోటీ పడడానికి పేర్లు ఎలా నమోదు చేసుకోవాలో కిరణ్ మాటిక్స్ సభ్యులు వివరించారు. క`త్రిమ మేథతో స్వతంత్రంగా వ్యవహరించే రోబోట్ లు, మనుషుల ప్రమేయంతో నడిచే రోబోట్ లు, వాటిని నిర్మించడానికి అవసరమైన ఛాసిస్, మోటార్లు, వివిధ రకాల చక్రాలు, బ్యాటరీలు, స్విచ్ లు, ఆర్డినో యునొ, జాయ్ స్టిక్స్, ఇన్-ఫ్రారెడ్ (ఐఆర్) సెన్సార్లు, ఎల్ఎస్ఆర్బీ అల్గోరిథం వంటి పరికరాలు, అవి పనిచేసే విధానాలు వారు విశదీకరించారు.
ప్రాథమిక రోబోటిక్ సిస్టమ్ లను నిర్మించడం, నిర్వహించడం వంటి వాటిపై విద్యార్థులకు కిరణ్ మాటిక్స్ సభ్యులు మార్గనిర్దేశం చేస్తూ, వారికి ప్రయోగాత్మక అనుభవాన్ని అందించారు. అందులో చురుకుగా పాల్గొని స్వీయ అనుభవం గడించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తూ, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
తొలుత, జీ-ఎలక్ట్రా అధ్యక్షుడు ఎం.సాయికృష్ణ స్వాగత వచనాలతో కార్యశాల ప్రారంభం కాగా, విద్యార్థి సమన్వయకర్త జేమ్స్ వందన సమర్పణతో ముగిసింది. అధ్యాపక సమన్వయకర్త ఎం.నరేష్ కుమార్ దీనిని పర్యవేక్షించారు. గీతం విద్యార్థులకు రోబోటిక్స్ పై అవగాహన కల్పించి, వారిని జాతీయ సాంకేతిక పోటీలలో పాల్గొని, రాణించేలా ఈ కార్యశాల ప్రేరేపించింది అనడంలో అతిశయోక్తి లేదు.