తెలంగాణలో గతేడాది ఆగస్టులో భారత జాగృతి సంస్థ కార్యకలాపాల కోసం వివిధ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేశారు. అయితే, భారత జాగృతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత జాగృతి సంస్థకు చెందిన అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్టు నేడు ప్రకటించారు. విదేశీ, జాతీయ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్టు కవిత కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. కమిటీల రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, ఈ కమిటీలను ఎందుకు రద్దు చేస్తున్నారన్నది ఆ ప్రకటనలో తెలియజేయలేదు.
