ఇప్పటి వరకు సామాన్యులనే పెట్రోల్ బంకులు పలు రకాలుగా మోసం చేస్తువస్తున్నాయి. సాక్షాత్తూ హైకోర్టు జడ్జీనే బురిడీ కొట్టించబోయారు. 50 లీటర్ల పెట్రోల్ సామర్థ్యం కలిగిన కారులో 57 లీటర్లు నింపినట్లు ఇచ్చిన బిల్లు చూసి జడ్జీ షాక్ తిన్నారు. ఆయన వెంటనే అధికారులకు చెప్పడంతో జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగారు. సదరు పెట్రోల్ బంకును సీజ్ చేయడంతోపాటు ఇతర బంకులపైనా దాడులు చేపట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జీ గురువారం తన కారుకు పెట్రోల్ కొట్టించుకునేందుకు ఓ బంకు వద్ద ఆగారు.
ట్యాంకు ఫుల్ చేయించమని డ్రైవర్కు చెప్పారు. ఆయిల్ కొట్టిన అనంతరం పెట్రోల్ బంకు ఇచ్చిన బిల్లు చూసి ఆయన కంగుతిన్నారు. కారు ట్యాంకు సామర్థ్యం 50 లీటర్లు ఉంటే.. 57 లీటర్లు పోసినట్లు చూపించడంతో జడ్జీ విస్తుపోయారు. దీంతో వెంటనే విషయాన్ని వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సివిల్ సప్లయ్ డిపార్టమెంట్ అధికారులు రంగంలోకి దిగి బంకును సీజ్ చేశారు. ఆ ప్రాంతంలోని ఇతర పెట్రోల్ బంకులూ ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నాయా? అనేది తెలుసుకోడానికి తనిఖీలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నలుగురు సభ్యులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేశారు.