contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కరాచీ ఎయిర్‌పోర్టు వద్ద భారీ పేలుడు .. ఇద్దరు మృతి

పాకిస్థాన్‌, కరాచీ : కరాచీ ఎయిర్‌పోర్టులో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాలు అమర్చిన ఓ ట్యాంకర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చైనా పౌరులు మృతి చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో నలుగురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. క్షతగాత్రులు అందరినీ అత్యవసర చికిత్స కోసం సమీపంలోని జిన్నా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

భారీ పేలుడు తర్వాత మంటలు చెలరేగి పక్కనే ఉన్న కార్లను చుట్టుముట్టాయి. ఘటనా స్థలం నుంచి దట్టమైన పొగ వెలువడింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక ఆ ప్రదేశంలో భారీ సైనిక బలగాలు మోహరించి ఉండడంతో వెంటనే ఘటనా స్థలాన్ని చుట్టుముట్టాయి.

కాగా విదేశీ పౌరులపై జరిగిన దాడి ఇది అని సింధ్ రాష్ట్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. విదేశీ పౌరులను లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. పేలుడు చాలా పెద్దది కావడంతో విమానాశ్రయ భవనాలు కంపించాయని పాకిస్థాన్ పౌర విమానయాన శాఖ అధికారి రాహత్ హుస్సేన్ వెల్లడించారు. సింధ్ రాష్ట్ర సీఎం మురాద్ అలీ షా ఈ ఘటనపై సమగ్ర నివేదిక కోరారని పోలీసులు తెలిపారు.

బాధ్యత వహించిన బీఎల్ఏ..
కరాచీ ఎయిర్‌పోర్టులో పేలుడుకు వేర్పాటువాద మిలిటెంట్ గ్రూప్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) బాధ్యత తీసుకుంది. ఈ మేరకు ఒక ఈ-మెయిల్ ప్రకటన విడుదల చేసింది. చైనా జాతీయులు లక్ష్యంగా వాహనంలో పేలుడు పరికరాన్ని అమర్చామని, ఈ పేలుడు తామే చేశామని బీఎల్ఏ పేర్కొంది. కాగా ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్‌లతో సరిహద్దులు పంచుకుంటున్న బలూచిస్థాన్ ప్రావిన్స్‌కు స్వాతంత్య్రాన్ని ఇవ్వాలంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ పోరాడుతోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :