contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పదిహేను పక్కన ఇన్ని సున్నాలా… రేవంత్ సర్కారుపై కేటీఆర్ కౌంటర్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. మూసీ నదిని అందంగా ముస్తాబు చేసేందుకు మొన్న రూ.50 వేల కోట్లు అవుతుందని అన్నారు… నిన్న రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారు… నేడు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారని వివరించారు.

తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు అయితేనే కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందని విమర్శించారు. మరి, సుందరీకరణకే రూ.1.50 లక్షల కోట్లా…! పదిహేను పక్కన ఇన్ని సున్నాలా… 15,000,000,000,000… అంటూ కేటీఆర్ వ్యంగ్యం ప్రదర్శించారు.

ఇంతకీ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందరు? నిల్వ ఉంచే టీఎంసీలు ఎన్ని? సాగులోకి వచ్చే ఎకరాలు ఎన్ని? పెరిగే పంటల దిగుబడి ఎంత? తీర్చే పారిశ్రామిక అవసరాలెంత? కొత్తగా నిర్మించే భారీ రిజర్వాయర్లు ఎన్ని? అని కేటీఆర్ ప్రశ్నించారు. పుట్టినగడ్డపై మమకారం లేని ముఖ్యమంత్రి గారికి… పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కంటే కూడా మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకింత మక్కువ? అంటూ కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

చివరి దశలో ఉన్న ప్రాజెక్టును పక్కనబెట్టి… మూసీ చుట్టూ ఎందుకింత మంత్రాంగం…? అంటూ సందేహం వ్యక్తం చేశారు. లండన్ లోని థేమ్స్ నదిలాగా మారుస్తామనే వ్యూహం వెనుక థీమ్ ఏంటి? గేమ్ ప్లాన్ ఏంటి? అంటూ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి గారూ… మూడింతలు పెంచిన మూసీ అంచనా వ్యయం కాంగ్రెస్ ధన దాహానికి సజీవ సాక్ష్యం… మూసీ ప్రాజెక్టును చేపట్టాల్సిందే, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాల్సిందే… కానీ… మాటల దశలోనే ఉన్న ప్రాజెక్టులో మూటలు పంచుకునే పని షురూ చేస్తే మాత్రం సహించేది లేదు అంటూ కేటీఆర్ హెచ్చరించారు. తట్టెడు మట్టి కూడా తీయకముందే కోట్లు తన్నుకుపోయే కుట్రకు తెరదీస్తే భరించబోమని స్పష్టం చేశారు.

మూసీ రివర్ ఫ్రంట్ పేరిట బ్యాక్ డోర్ లో జరుగుతున్న భాగోతాన్ని తెలంగాణ సమాజం అనుక్షణం గమనిస్తోంది… కుంభకోణాల కాంగ్రెస్ కు కర్రుకాల్చి వాతపెడుతుంది అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :