contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తెలంగాణలో ఉపఎన్నికలు తప్పవు ! : కేటీఆర్

హైదరాబాద్ : తెలంగాణలో ఉపఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదన్నారు. పార్టీ ఫిరాయింపులపై తమ పార్టీ ఢిల్లీలో న్యాయపోరాటం చేస్తుందన్నారు. రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశమైనట్లు తెలిపారు. త్వరలో సుప్రీంకోర్టులో పార్టీ తరఫున పిటిషన్ వేస్తామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసిందని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులతో తన ఆధ్వర్యంలో పార్టీ బృందం చర్చలు జరిపిందన్నారు. అటు రాజ్యాంగ నిపుణులతోనూ ఈ రోజు పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైందని వెల్లడించారు.

ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్‌కు సంబంధించి సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని రాజ్యాంగ నిపుణులు ఆర్యమా సుందరం తమ పార్టీ బృందానికి తెలిపారని వెల్లడించారు. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘ కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాన్చలేరన్నారు. ఈ సందర్భంగా ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్‌తో పాటు, పార్టీ మారిన ఎమ్మెల్యేల పైనా స్పీకర్‌కు చేసిన ఫిర్యాదు విషయాన్ని, వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు.

ఈ విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు కూడా ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం ఉండదని న్యాయ నిపుణులు వెల్లడించారు. హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటించకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు.

సుప్రీంకోర్టు తీర్పులతో పాటు న్యాయకోవిదులు, రాజ్యాంగ నిపుణులు చెబుతున్న సలహాలు, సూచనల మేరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం తేలిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఒకవైపు జాతీయస్థాయిలో పార్టీ ఫిరాయింపుల పైన సుద్దపూస ముచ్చట్లు చెబుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. త్వరలో కోర్టుల సహాయంతో కాంగ్రెస్‌కు సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :