ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సు లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందంతో ప్రముఖ సంస్థలు చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మేఘా ఇంజనీరింగ్ (ఎంఇఐఎల్) కంపెనీతో తెలంగాణ సర్కార్ మూడు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది.
మొత్తం రూ.15 వేల కోట్లతో 2160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఉత్పత్తి ప్రాజెక్టు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టు, అనంతగిరి కొండల్లో ప్రపంచ స్థాయి వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ అవగాహన ఒప్పందాలు చేసుకుంది. మేఘా పెట్టుబడి నిర్ణయాలను పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వాగతించారు. ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా దాదాపు ఏడు వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టుకు రూ.11వేల కోట్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టుకు రూ.3వేల కోట్లు, వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్కు రూ. వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టాలని సంస్థ నిర్ణయించింది.