2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం నాడు నిజామాబాద్ వేదికగా తనపై విజయం సాధించిన బీజేపీ యువనేత ధర్మపురి అరవింద్పై విమర్శల దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రజా తీర్పును గౌరవించి ప్రజలకు సేవ చేసేందుకు అరవింద్కు మూడేళ్ల సమయం ఇచ్చానని చెప్పిన కవిత… ఈ మూడేళ్లలో నిజామాబాద్కు అరవింద్ ఏం చేశారని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
కవిత విమర్శలకు ధర్మపురి అరవింద్ వేగంగానే స్పందించారు. తన చేతిలో ఎదురైన ఓటమి నుంచి బయటపడేందుకు కవితకు మూడేళ్ల సమయం పట్టిందని అరవింద్ సెటైర్ సంధించారు. ఈ విమర్శల లొల్లి అవసరం లేదని చెప్పిన ఆయన… రైతుల కోసం తాను చేయాల్సింది చేస్తానని, కవిత కూడా తాను చేయాలనుకుంటున్నది చేసుకోవచ్చని తెలిపారు. 2024లో జరిగే ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి మళ్లీ తనపైనే పోటీ చేయాలన్న అరవింద్… దూద్ కా దూద్ పానీ కా పానీ హో జాతా అంటూ కవితకు సెటైరిక్ రిప్లై ఇచ్చారు.