- ఉపాధి కూలీలకు పూర్తి పేమెంట్లు అందేలా చర్యలు
- చిలకలగెడ్డలో ఉపాది పనులను పరిశీలించిన ఎంపీపీ శెట్టి నీలవేణి
అల్లూరి జిల్లా,అనంతగిరి: అనంతగిరి మండలంలో ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న ప్రతి ఒక్క వేతనదారునికి రూ.270 రూపాయల పూర్తి పేమెంట్లు అందేలా మస్థర్లు వేయాలని ఏపీవో అర్జున్ కు అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణి ఆదేశించారు. మండలంలోని చిలకలగెడ్డ పంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను అధికారులతో కలిసి శనివారం ఆమె పరిశీలించారు.పనుల్లో నాణ్యతను పాటించాలని అదేవిధంగా పనులు చేసిన కూలీలకు పూర్తిస్థాయి పేమెంట్లు అందేలా మస్టర్లు వేయాలని ఆమె సూచించారు. ఉపాధి పనిముట్లను సరఫరా చేయాలని ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు మజ్జిగ వంటి పానీయాలను అందజేయాలని కూలీలు ఆమెను కోరారు.ఈ మేరకు విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తానని ఆమె హామీ ఇచ్చారు.
ఉపాధి కూలీలు ఎండ నుంచి ఉపశమనం పొందే విధంగా తార్పాన్లను ఆమె సొంత నిధులతో పంపిణీ చేశారు. కూలీలకు తన వంతు సహాయంగా వీటిని అందిస్తున్నానని ప్రభుత్వం నుంచి పనిముట్లు తార్పానుల వంటివి పంపిణీ చేసే విధంగా తమ నుంచి కోరతామని తెలిపారు.డిమాండ్ ఇచ్చిన పనికి కూలీలు తప్పనిసరిగా హాజరుకావాలని తద్వారా వంద రోజులు పని దినాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ఏవీవీ కుమార్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏపీఓ అర్జున్,ఏవోలక్ష్మీనారాయణ, ఉపాధి హామీ టెక్నికల్అసిస్టెంట్లు, మెట్లు పాల్గొన్నారు.