contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ముషారఫ్‌కు మరణానంతర మరణశిక్ష

పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌కు మరణశిక్ష పడింది. పాక్ మీడియా కథనం ప్రకారం.. దేశ ద్రోహం కేసులో స్పెషల్ కోర్టు.. ఈ మరణశిక్ష విధించినట్లు తెలుస్తోంది. ఆయన దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని దేశద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులపై విచారణ జరిపిన పెషావర్ కోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం దోషిగా తేల్చింది. ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు ముషారఫ్ మరణ శిక్షను సమర్థించగా.. మరొక న్యాయమూర్తి వ్యతిరేకించారు. మెజార్టీ న్యాయమూర్తుల నిర్ణయంతో మరణ శిక్ష ఖరారైంది.

సైనిక తిరుగుబాటు ద్వారా 1999లో అధికారం చేజిక్కించుకున్న జనరల్ పర్వేజ్ ముషారఫ్.. దాదాపు పదేళ్ల పాటు దేశాన్ని పాలించారు. ఈ కాలంలో రెండుసార్లు అత్యవసర పరిస్థితి విధించి రాజ్యాంగాన్ని రద్దు చేశారు. 2008లో అధికారానికి దూరమైన తర్వాత దీనికి సంబంధించిన కేసులు ఎదుర్కొన్నాడు. రాజ్యాంగాన్ని రద్దు చేయడంపై దేశద్రోహ ఆరోపణలతో కేసు నమోదు కాగా.. సుదీర్ఘ కాలం పాటు కోర్టులో విచారణ జరిగింది. 2019లో స్పెషల్ కోర్టు ఆయనకు మరణ శిక్ష విధించింది.

ముషారఫ్ దుబాయ్ నుంచే దీనిపై న్యాయ పోరాటం చేశారు. ఈ తీర్పును లాహోర్ హైకోర్టులో సవాల్ చేశారు. లాహోర్ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించగా.. పిటిషన్ దారులు, ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. స్పెషల్ కోర్టు తీర్పుపై విచారణ జరుగుతుండగానే గతేడాది ఫిబ్రవరి 5న ఆయన దుబాయ్ లో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన తరఫు లాయర్లు సుప్రీం ధర్మాసనానికి తెలియజేశారు. ఆ తర్వాత ముషారఫ్ వారసులు తమకు అందుబాటులోకి రావడంలేదని, ఈ కేసులో పోరాడేందుకు వారు ఇంట్రెస్ట్ చూపడంలేదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

దీంతో ముషారఫ్ వారసులకు పాక్ సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది. పాకిస్థాన్ తో పాటు విదేశాల్లోని ప్రధాన పత్రికలలో ఈ నోటీసులను ప్రచురించేలా ఆదేశాలిచ్చింది. అయనప్పటికీ వారు కోర్టుకు హాజరుకాకపోవడంతో తాజాగా ఈ కేసులో తీర్పు వెలువరించింది. ముషారఫ్ కు విధించిన మరణ శిక్షను సమర్థించడం తప్ప తమకు ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ క్వాజీ ఫయేజ్ ఇసా పేర్కొన్నారు. మరణానంతరం ఆయనకు మరణ శిక్షను ఖరారు చేశారు.

సుప్రీంకోర్టు తీర్పుపై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది పాక్ చరిత్రలో నిలిచిపోయే తీర్పని పీపీపీ నేత ఫర్హతుల్లా బాబర్ కొనియాడారు. ‘దోషి (ముషారఫ్) ఇప్పటికే చనిపోవడంతో ఇప్పుడు ఉరి తీయడం సాధ్యం కాదు. కానీ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను అపహాస్యం చేసిన వ్యక్తిని న్యాయస్థానం దేశద్రోహిగా తేల్చడం, ఈ నేరానికి శిక్ష విధించడం స్వాగతించదగ్గ విషయం. రికార్డులకే పరిమితమైనప్పటికీ ఈ తీర్పుతో ఏ రాజ్యాంగాన్ని అయితే ఆయన అతిక్రమించాడో అదే రాజ్యాంగం ఇప్పుడు ఆయనను దోషిగా తేల్చింది. చరిత్రలో ఆయనను ఓ ద్రోహిగా నిలబెట్టింది’ అని వ్యాఖ్యానించాడు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :