కడప: ప్రొద్దుటూరు తెదేపా ఇన్ఛార్జ్ ప్రవీణ్కుమార్ రెడ్డి ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు. కడప కేంద్ర కారాగారం (సెంట్రల్ జైలు) లో ఉన్న ఆయన్ను ములాఖత్ ద్వారా వెళ్లి కలిశారు. గత కొద్దిరోజులుగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి (వైకాపా), ప్రవీణ్కుమార్రెడ్డి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు ఇటీవల ఆయన్ను అరెస్ట్ చేశారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రవీణ్ను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. దీంతో ఆయన్ను పరామర్శించేందుకు లోకేశ్ కడప వచ్చారు.ఎయిర్పోర్టుకు చేరుకున్న లోకేశ్కు తెదేపా నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయంలో జిల్లా ముఖ్య నేతలతో కొద్దిసేపు ఆయన సమావేశమయ్యారు. జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై నేతలతో చర్చించారు. అనంతరం ఎయిర్పోర్టు వెలుపల తెదేపా కార్యకర్తలు గజమాలతో లోకేశ్ను సత్కరించారు.
ములాఖత్కు 18 మందికి అనుమతి..
కడప సెంట్రల్ జైలులో ఉన్న ప్రవీణ్కుమార్ రెడ్డితో ములాఖత్కు 18 మందికి పోలీసులు అనుమతించారు. లోకేశ్తో పాటు మరో 17 మంది నేతలను మాత్రమే ఆయన్ను కలిసేందుకు పంపారు. జిల్లాలో లోకేశ్ పర్యటన, ప్రవీణ్కుమార్ రెడ్డి తో ములాఖత్ నేపథ్యంలో తెదేపా నేతలకు కడప పోలీసులు నోటీసులు జారీ చేశారు. చిన్న ఘటన జరిగినా జిల్లా తెదేపా నేతలదే బాధ్యతంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.