మొన్నటిదాకా ఎలక్షన్ కోడ్. ప్రభుత్వం అధికారంలోకొచ్చాక పాలనాయంత్రాంగం ప్రక్షాళనకు టైమే దొరకలేదు. అందుకే పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే పాలనపై ఫుల్ ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ సర్కార్. సీఎంవోలో మార్పులకు కసరత్తు చేస్తున్నారు సీఎం రేవంత్రెడ్డి. తెలంగాణలో ఉన్నతాధికారుల బదిలీలు భారీగా ఉండబోతున్నాయా? సీఎంవోలో కీలక బాధ్యతలు మారబోతున్నాయా? ఎలా ఉండబోతోంది రేవంత్ మార్క్ అఫీషియల్ టీం.
ఎన్నికల కోడ్ ముగియడంతో పాలనపై పోకస్ చేయబోతోంది రేవంత్ సర్కార్. ఇందు కోసం అన్ని శాఖల్లో కీలక అధికారులను మార్చేయాలని ప్లాన్ చేస్తోంది. టాప్ టూ బాటమ్ అన్నట్లు అందరిని రిషపిల్ చేయాలనే ఆలోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి జిల్లా కలెక్టర్ల వరకు మార్చేందుకు కసరత్తు చేస్తోంది. సీఎంవో తోపాటుగా మిగిత అన్ని కీలక విభాగాల్లో మార్పులు చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
డిసెంబరు నెలలో తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్.. పాలనపై పట్టు సారించేలోపే పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చేసింది. మార్చిలోనే లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో గత ప్రభుత్వ హయాంలో పని చేసిన అధికారులనే కొనసాగించారు. దీంతో పాటుగా చాలా శాఖల్లో ఖాళీగా ఉన్న అధికారులను భర్తీ చేయాల్సి ఉంది. అధికారం మారిన వెంటనే ఉన్నతాధికారులను మార్చుస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు రేవంత్ సర్కార్. తాజాగా ఎన్నికల కోడ్ ముగియడంతో బదిలీలపై ముఖ్యమంత్రి పోకస్ చేశారు.
ఇప్పటి వరకు జంబో ట్రాన్సపర్స్ చేయకపోవడంతో ఈసారి భారీగానే బదిలీలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ భారీగా మార్పులు చేర్పులు ఉంటాయని సమాచారం. వివిధ డిపార్ట్మెంట్లు, ఇతర రాష్ట్రాల నుండి డిప్యూటేషన్లో అధికారులను తీసుకువచ్చి సీఎంవోలో ఓఎస్డీలు, సెక్రటరీలుగా నియమించారు. పలు శాఖల బాధ్యతలను అప్పగించారు. కానీ ముఖ్యమంత్రి ఆశించిన స్థాయిలో వారి పెర్పామేన్స్ లేదనే టాక్ నడుస్తోంది. సీఎం స్వయంగా చెబితే తప్పా ఫైలు మూవ్ కావడం లేదనే ప్రచారం సచివాలయ వర్గాల్లో, మంత్రుల్లో, ఎమ్మెల్యేల్లో జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే అధికారుల మార్పు తథ్యంగా కనిపిస్తోంది.
6వ ప్లోర్ లో భారీగా అధికారుల మార్పులు..!
ఇక సీఎంవో అధికారుల్లో కీలక మార్పులు జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సీఎం ప్రిన్సిపల్ సెక్రటరిగా ఉన్నా శేషాద్రి కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వంలో అడిషనల్ సెక్రటరీ పోస్ట్కు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి ఎంప్యానల్ అయ్యారు. గతంలొ కూడా పీఎంవోలో పని చేశారు శేషాద్రి. ఇప్పుడు డిప్యూటేషన్ ఖరారు కావడంతో సీఎంవోకు కొత్త ప్రిన్సిపల్ సెక్రటరీ రానున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటుగా ఇప్పుడు సీఎంవోలో ఉన్న చాలా మంది అధికారుల బాద్యతలను కూడా మార్చాలని ప్రభుత్వం భావిస్తుందట. ఇందుకు ముఖ్యమంత్రి నుంచి క్లియరెస్స్ రాగానే అధికారులను మారుస్తారన్న ప్రచారం సచివాలయంలో జోరుగా సాగుతోంది.