హైదరాబాద్ లో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. గత కొన్నేళ్ళుగా స్తబ్దుగా ఉన్న రౌడీషీటర్లు రాజకీయ నేతల అండతో భూ దందాలు, సెటిల్ మెంట్లలో జోక్యం చేసుకుంటున్నారు. వివాదాస్పద భూముల్లో తలదూర్చి కోట్ల రూపాయలను గడిస్తున్నారు. రౌడీ షీటర్ల ఆగడాలు తెలిసినా రాజకీయ ఒత్తిడి కారణంగా పోలీసులు సైతం మిన్నకుండిపోతున్నారు. భూ వివాదాల్లో చిక్కుకుంటున్న కొందరు బడా బాబులు ప్రత్యర్థులపై కక్ష సాధింపుకు రౌడీషీటర్లను ఉసి గొల్పుతూ దాడులను ప్రోత్స హిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. పీడీ కేసులున్న ఉన్న రౌడీలకు ఉత్తములని సర్టిఫికెట్ ఇస్తున్నారని పోలీసుల పై ఆరోపణలు వినవస్తున్నాయి.
నగరంలో వంద గజాల భూమి లక్షల్లో పలుకుతుంది. అది వివాదస్పద భూమైతే రౌడీషీటర్ల కు వరంగా మారుతుంది. సెటిల్మెంట్ చేస్తే లక్షల్లో పర్సంటేజీలు.. ఈజీ మనీ సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్న కొంతమందికి ఇటువంటి భూ దందాలు అక్షయపాత్రలా కనిపిస్తున్నాయి. ఒక భూదందాలో దూరి సెటిల్చేస్తే లక్షల్లో వాటాలు.. రౌడీషీటర్లు, రియాల్టర్లు, వారి అనుచరులు ఇలా ఒకరేమిటీ అందరు సెటిల్మెంట్లలో మునిగితేలుతున్నారు.
గతంలో భూవివాదం తలెత్తితే అసలు యజమాని కోర్టుకు వెళ్లేవారు. ధనబలం.. రాజకీయ పలుకుబడితో భూకబ్జాలు చేస్తుండడంతో బాధితులు సత్వరమే న్యాయం కోరుతూ పోలీస్ స్టేషన్లను, ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ న్యాయం దొరుకుతుందా అంటే.. అక్కడికి బాధితుల కంటే ముందే రౌడీషీటర్లు వాలిపోతున్నారు. కోర్టు, రెవెన్యూ కోర్టుకు వెళ్లినా కూడా సంవత్సరాల కొద్దీ సమయం పడుతుందని బాధితుల్లో ఎక్కువ మంది పోలీసులు, నేతల అనుచరులు, రౌడీషీటర్ల వద్దకే భూ పత్రాలను పట్టుకుని వెళ్తున్నారు. పోలీస్స్టేషన్లకు సైతం ఇటీవల కాలంలో ఎక్కువగా భూ ఆక్రమణల కేసులపైనే ఫిర్యాదులు వస్తున్నాయని సమాచారం.
పీడీ కేసు ఉన్న రౌడీలకు పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చి వారికి అండగా ఉంటున్నారని సమాచారం. నేటి రౌడీ రేపటి రాకజియా నాయకుడు అవుతున్నాడు, భూ దందాలతో డబ్బు సంపాదించి కార్పొరేటర్ బరిలోకి , ఎల్లుండి ఎమ్మెల్యే ఆ మరునాడు మంత్రి అవుతాడు. రౌడీలను రాజకీయ నాయకుడిగా మార్చుతుంది ఎవరు ? రౌడీషీటర్లకు ఎమ్మెల్యేల అండదండలున్నాయంటూ పోలీసులు స్వేచ్ఛగా వదిలి వేయడంతో తిరిగి వారు బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు రౌడీషీటర్లపై దృష్టి సారించి వీరి వల్ల ఇబ్బందులు పడుతున్న అమాయక ప్రజల ధన, ప్రాణాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు.