- తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఎవరు నిర్మించారు..?
- తొండమానుడు ఎవ్వరు…?
- శ్రీనివాసుని కోరిక మేరకే ఆలయ నిర్మాణం జరిగిందా…?
ఏడుకొండలపై కొలువై.. కోనేటి రాయుడుగా పూజలందుకుంటున్న తిరుమలేశుడు.. శేషాచలం అడవుల్లో ఎలా వెలసారో..? ఇప్పటికీ అంతుపట్టని మిష్టరీ..? స్వామి వారి అందమైన ఆ రూపం.., తొణికిసలాడే జీవకళ భక్తకోటిని మైమరిపిస్తోంది. కోరినవారికి కొంగు బంగామై..ఆరాధ్యదైవంగా పూజలందుకుంటున్నారు శ్రీ వేంకటేశ్వర స్వామి వారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సప్తగిరీశుడు.., ఆనంద నిలయంలో ఉంటూ.. అర్చామూర్తిగా
భక్తులకు అభయప్రధానం చేస్తున్నారు. మరీ…స్వామి వారి దివ్య మైన ఆ విగ్రహం కొండమీద ఎలా వచ్చిందనే విషయం ఎవ్వరికీ తెలియదు. అయితే…తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఎవ్వరు నిర్మించారనే విషయం ఆసక్తికరంగా ఉన్నా…, ఆధునిక ప్రజలకు అంతుపట్టని ప్రశ్ననే…చేప్పాలి…!
ఈ చారిత్రక నేపథ్యం పై ప్రత్యేక కథనం……..
కలియుగ వైకుంఠం.. తిరుమల తిరుపతి. సాక్షాత్తు విష్ణుమూర్తి కలియుగంలో భక్తులను అనుగ్రహించడానికి అర్చతామూర్తి అవతారంగా శ్రీనివాసుడిగా అవతరించాడు. అయితే ప్రస్తుతం తిరుమలలో ఉన్న ఆనందనిలయం శ్రీవారి ఆలయం ఎవరు నిర్మించారు దాని వెనుకు కథ తెలుసుకుందాం..
ప్రస్తుతం కాంచీపురంగా పిల్చుకునే ఒకప్పటి తొండైమండలం సామ్రాజ్యానికి అధిపతి తొండమానుడు. ఒకరోజు తొండమానుడు ఓ మధుర స్వప్నాన్ని కన్నాడు. ఆ కలలో విష్ణుమూర్తి కనిపించి ఇలా చెప్పాడు. ”భక్తా, పూర్వజన్మలో నీ పేరు రంగదాసు. నీకు స్త్రీ వ్యామోహం లేకుండా చేసి, నిన్ను మహారాజుగా చేశాను. క్రమంగా మనమధ్య బాంధవ్యం పెరిగింది. అనుబంధం పెనవేసుకుంది. ప్రస్తుతం నేను వేంకటేశ్వరునిగా శేషాచలమున స్థిర నివాసం ఏర్పరచుకో దలచాను. కలియుగం అంతమయ్యే వరకు వేంకటేశ్వరుని అవతారంలో కొండమీదే ఉంటాను. కనుక నువ్వు నాకోసం ఒక ఆలయాన్ని నిర్మించాలి. శ్రీ వరాహస్వామి పుష్కరిణి పక్కన ఆలయ నిర్మాణం కోసం స్థలం కేటాయించాడు. అక్కడ నువ్వు వెంటనే ఆలయాన్ని కట్టించు..” అన్నాడు. వేంకటేశ్వరుని మాటలు విన్న తొండమానుడు – ”సంతోషం స్వామీ తమరు కోరిన విధంగా తక్షణం ఆలయం నిర్మిస్తాను…” అని బదులిచ్చాడు. అంతలో తొండమానుడికి మెలకువ వచ్చేసింది. ఇక ఆతనికి ఆకాశంలో తెలిపోతున్నట్టుగా ఉంది.
స్వామివారు తనకు స్వప్నదర్శనం ఇవ్వడం అంటే సామాన్యమైన సంగతి కాదు. పైగా తనకో గుడి కట్టించమంటూ బృహత్తర బాధ్యత అప్పజెప్పాడు. అది కేవలం కలగా అనిపించలేదు. వేంకటేశ్వరుడు ప్రత్యక్షమైనట్టే ఉంది. స్వయంగా చెప్పిన భావనే కలిగింది. సంతోషంతో మురిసిపోయాడు. శ్రీనివాసుని కోసం ఆలయం నిర్మించేందుకు ఆప్తులతో చర్చించాడు, ప్రణాళిక రచించాడు. తొండమానుడు వెంటనే విశ్వకర్మను రప్పించాడు. మంచి ముహూర్తం చూసి ఆలయ నిర్మాణం కోసం పునాదులు వేయించాడు. కేవలం దేవాలయం, గర్భగుడి, ధ్వజస్తంభంతో సరిపెట్టకుండా బ్రహ్మాండంగా కట్టించాలి అనుకున్నాడు. తొండమానుడు అనుకున్నట్టుగానే, అనతికాలంలోనే దేవాలయ నిర్మాణం పూర్తయింది.
విశాలమైనపాకశాల, సువిశాలమైన గోశాల, గజశాల, అశ్వశాల, బంగారు బావి, మంటపాలు, ప్రాకారం, గోపురం – ఇలా అనేక గదులతో ఆలయం బహు గొప్పగా రూపొందింది. గుడిని చేరడానికి మార్గం సుగమంగా ఉండాలి అని భావించి కొందరు భక్తులు శేషాచలం చేరడానికి రెండువైపులా దారులు ఏర్పరిచారు. సోపానాలు నిర్మించారు. మార్గమధ్యంలో అక్కడక్కడా మంటపాదులు నిర్మించారు. ఆలయ నిర్మాణం, గుడికి వెళ్ళే రహదారి, సోపానాలు పూర్తయిన తర్వాత విషయాన్ని వేంకటేశ్వరునికి తెలియజేశాడు తొండమానుడు. వేంకటేశ్వరుడు ఈ వర్తమానాన్ని సవివరంగా ముల్లోకములకు తెలియపరిచాడు. అప్పుడు బ్రహ్మ, మహేశ్వరుడు, ఇతర దేవతలు అందరూ కలిసి శేషాచలం చేరుకున్నారు. శుభ ముహూర్తం చూసి వేంకటేశ్వరుడు పద్మావతీ సమేతుడై ఆలయమున ఆనంద నిలయంలో ప్రవేశించాడు. అది అద్భుతమైన, అపురూపమైన వేడుక. అత్యంత కమనీయంగా, రమణీయంగా జరిగింది.
తిరుమల వేంకటేశ్వరుని ఆలయ వివరాలు పురాణాల్లో ఈవిధంగా ఉన్నాయి. మొత్తానికి తొండమానుడు కట్టించిన దేవాలయాన్ని చోళులు అభివృద్ధి చేశారు. తర్వాత పల్లవరాజులు, తంజావూరు చోళులు, విజయనగర రాజులు దేవాలయాన్ని మరింత తీర్చిదిద్దారు. ఇలా అనేకమంది భక్తులు ఆ స్వామి దేవాలయ నిర్మాణానికి తమవంతు కృషిచేశారు. దేవ దేవుని పై తమకున్న భక్తిప్రపతులను చాటుకున్నారు.
సేకరణ : వెంకట సుబ్బయ్య , సీనియర్ జర్నలిస్ట్