contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని, మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించబడింది.

ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె. శ్వామలరావు మాట్లాడుతూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. “సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము” అని ఆయన పేర్కొన్నారు.

మంగళవారం ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆనందనిలయం నుండి బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల, ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు.

శుద్ధి అనంతరం పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేయబడింది. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలు కలిపి ఆలయాన్ని శుభ్రపరచడం జరిగింది. అనంతరం, స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులను దర్శనానికి అనుమతించగా, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం దృష్ట్యా మంగళవారం అష్టదళ పాద పద్మారాధన, విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవో గౌతమి, సివిఎస్వో శ్రీధర్, ఆలయ డెప్యూటీ ఈఓ లోకనాథం, పేష్కర్ శ్రీరామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :